ఇరాన్, జనవరి 14: రాజధాని తెహ్రాన్ లో ఓ సైనిక విమానం కుప్పకూలడంతో 15 మంది సైనుకులు మృతి చెందారు. ఆ దేశ మీడియా సమాచారం ప్రకారం విమానంలో ఉన్న 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ చేస్తున్న సమయంలో వొక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్ రాజధాని బిషెక్ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్ విమానం వేరే రన్వేపై దించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.
విషయం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ లలో చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు.