హైదరాబాద్, జనవరి 13: రాష్ట్రంలోని గ్రామపంచాయతి ఎన్నికల్లో రెండో దశ నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ నేటితో ముగియనుంది. దీంతో నామినేషన్లు వేసిన వారిని బరిలోనుంచి తప్పించేం దుకుప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల తక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో నామినేషన్లు తక్కువగా అయిన ప్రాం తాలలో ఏకగ్రీవం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తుచేస్తున్నారు. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసే విషయంపై ఎమ్మెల్యేలు ప్రత్యేకదృష్టి సారించారు. పంచాయతీలలో తమ అనుచరులకే దక్కేలా తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు.
అవసరమైతే వచ్చే సహకార ఎన్నికల్లో అవకాశం ఇస్తామంటూ వల వేస్తున్నారు. సహకారం సంఘం డైరక్టర్ స్థానానికి మద్దతు ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసి స్థానానికి అవకాశాలు కల్పిస్తామంటూ బుజ్జగింపులు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో డబ్బులుసైతం ఆశ చూపిస్తున్నారు. ఏకగ్రీవం చేసుకునేందుకు తీవ్రప్రయత్నాలు కొనసాగుతూన్నాయి. మొదటి విడతలో 4479 సర్పంచ్ అభ్యర్థులకు, 39,822 వార్డు సభ్యులకు సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 4,479 సర్పంచ్ స్థానాలకు 27,940 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 39,822 వార్డు సభ్యులకు సంబంధించి 97,690 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల పరిశీలన బుధవారం పూర్తికాగా పలునామినేషన్లను తిరస్కరించారు.