హైదరాబాద్, జనవరి 12: నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లో మసాజ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. తన రైలు రావడానికి సమయం ఎక్కువైతే మసాజ్ సెంటర్ కు చేరుకొని ఈ చైర్లపై కూర్చుంటే అదే బాడీ అంతా మసాజ్ చేస్తుంది. బెంగళూర్కు చెందిన ప్రైవేటు సంస్థ రూపొందించిన ఈ మసాజ్ చైర్లను దేశంలోనే తొలిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. దీనిని డీఆర్ఎం అరుణ్కుమార్ జైన్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ చైర్పై కూర్చొని ఐదు నిమిషాలు మసాజ్ చేయించుకుంటే రూ. 40 వసూలు చేస్తారు. పది నిమిషాలకు రూ.80, పదిహేను నిమిషాలకు రూ. 120 ఫీజును వసూలు చేస్తున్నారు. రోజూ ఉదయం 9.30గంటల నుంచి, రాత్రి 10 గంటల వరకు ఈ మసాజ్ సెంటర్ తెరిచి ఉంటుంది. రాబోయే రోజుల్లో 24గంటలు అందుబాటులో ఉందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మసాజ్ చేయించుకోదల్చిన వారు 9886177817 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.