విజయవాడ, జనవరి 12: వైసీపీ అధినేత జగన్ కొడికత్తి కేసు ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రావును ఈ రోజు విజయవాడ సబ్ జైల్లో తన తరపు న్యాయవాది సలీం అతనితో పలు అంశాలు చర్చించారు. అనంతరం శ్రీనివాస్ నార్కో అనాలిటిక్ పరీక్షలకు సిద్దంగా వున్నట్లు తెలిపారు సలీం. కేవలం తన పేరు సంచలనంగా మారడం కోసమే శ్రీనివాస్ జగన్ పై దాడికి పాల్సడ్డాడని...ఇందులో ఎలాంటి కుట్ర, రాజకీయ కక్షసాధింపులు లేవని సలీం వెల్లడించారు. అయితే ఈ మధ్య ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్ఐఏ దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ అధికారులు వారం రోజుల పాటు నిందితుడిని విచారించనున్నారని ఆ విచారణ తన సమక్షంలోనే జరగాలని డిమాండ్ చేశారు. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తనను విచారణ సమయంలో అనుమతించాలని ఎన్ఐఏ అధికారులను సలీం కోరారు. శ్రీనివాస్ ను వారం రోజులపాటు కస్టడీకీ అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు అనుమతిస్తూనే పలు షరతులు విధించింది. ఈ కేసు విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతీ 3రోజులకు వొకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించింది.