హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ హోంమంత్రి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు కాంగ్రెస్ నేతల్లో గందరగోళం ఏర్పడింది. కాగా ఆ ఆరుగురు శాసనసభ్యులు కూడా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. కొంత మంది శాసనసభ్యులు తమ సెల్ ఫోన్లను స్విచాఫ్ చేయగా, మరికొందరు లిఫ్ట్ చేయడం లేదు. దీంతో వారు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడ్డారనే ప్రచారానికి బలం చేకూరుతోందని అంటున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఐరోపా పర్యటనను ముగించికుని తిరిగి వచ్చారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
కాంగ్రెసులో ఉండడం వల్ల వొనగూరే ప్రయోజనం ఏమీ లేదనే ఉద్దేశంతో వారు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆకర్షించడదానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈలోగనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి గెలిచినవారిలో సాధ్యమైనంత ఎక్కువ మందిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. ఆ వ్యూహాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆయా జిల్లాలలో నేతలతో అమలు చేస్తున్నట్లు సమాచారం.