పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారు..???

SMTV Desk 2019-01-12 11:42:29  YS Jagan mohan reddy, YSRCP, TDP, Chandrababu, NTR, Narendramodi, KCR

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్థంతిని ఘనంగా నిర్వహించాలని సూచించారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో లెజండరీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ అందరికి స్పూర్తినిస్తుందన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. ప్రతిపక్షనేత జగన్‌ది పాదయాత్ర కాదని, అది కేవలం విలాస యాత్రని ఎద్దేవా చేశారు.

తాను సైతం ఇంటికెళ్లకుండా 208 రోజులు పాదయాత్ర చేశానని, పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేసీఆర్‌తో కలిసి ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తానని జగన్ అంటున్నారని, టీఆర్ఎస్‌తో వైసీపీ లాలూచీకి జగన్ వ్యాఖ్యలే రుజువులని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి జగన్ ఏనాడు మాట్లాడలేదని మోడీకి భయపడేవాడు ఏపీకి న్యాయం చేస్తాడా అని సీఎం ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే మోడీ 10 శాతం రిజర్వేషన్ల బిల్లును తెచ్చారని కాపు, ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని చంద్రబాబు ఆరోపించారు.