న్యూఢిల్లీ, జనవరి 11: సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ భారత పోలీస్ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన అలోక్ వర్మ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో సీబీఐ వ్యవస్థలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయనను బదిలీ చేసిన తరువాతి రోజే సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం సీబీఐ అత్యున్నత పదవి నుంచి వర్మను తొలగించడం ఇది రెండవసారి. సీబీఐ చీఫ్గా తనను తప్పించి ప్రభుత్వం అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్ధానం విచారణ చేపట్టి తిరిగి ఆలోక్కు సీబీఐ పగ్గాలు అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే అంతకుముందు సీబీఐ చీఫ్గా ఆలోక్ వర్మకు వీడ్కోలు పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ ఆలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాతో విభేదాల నేపథ్యంలో తీవ్ర మనస్ధాపంతో ఆలోక్ వర్మ రాజీనామా చేసారు. సీబీఐ చీఫ్గా ప్రభుత్వం తనను తప్పించడంపై న్యాయపోరాటంలో ఆలోక్ నెగ్గినా ప్రభుత్వం తిరిగి వేటు వేయడం ఆయనను కలిచివేసింది.