కడప, జనవరి 11: వైసీపీ అధినేత జగన్ పాద యాత్ర అనంతరం శ్రీవారిని దర్శించుకొని తన సొంత జిల్లాకు చేరుకోగా కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లాలో వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రవేశించగానే ఆ పార్టీ నేతలు, అభిమానులు జగన్తో పాటు ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను జగన్ శుక్రవారం నాడు సందర్శించుకొన్నారు. దర్గా వద్ద జగన్ మొక్కులు చెల్లించుకొని చాదర్ను కప్పారు. అనంతరం ఉద్యానవనశాఖ విద్యార్థులతో జగన్ సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా ఉద్యానవనశాఖ విద్యార్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సెక్రటేరియట్లను ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆరు మాసాల్లోపుగా ఈ గ్రామ సెక్రటేరియట్లను అమల్లోకి తీసుకొస్తామన్నారు.
గ్రామ సెక్రటేరియట్లలో టెక్నికల్ సిబ్బందిని నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వ్యవసాయం ఎలా చేయాలనే విషయమై టెక్నికల్ సిబ్బంది సూచనలు, సలహలు ఇస్తారని చెప్పారు. వొకే గ్రామంలో ఎక్కువ మంది అర్హులుంటే పక్క గ్రామాల్లో వారి సేవలను ఉపయోగిస్తామని జగన్ హామీ ఇచ్చారు.