లక్నో, జనవరి 11: ఉత్తరప్రదేశ్ లో మరల పట్టు సాధించేందుకు అఖిలేష్ యాదవ్, మాయావతి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీని నిలువరించి తాము పూర్వ వైభవం పొందేందుకు ఏళ్ల నాటి వైరాన్ని రెండు పార్టీలు పక్కన పెట్టేశాయి. ఈ సందర్బంగా వీరి కూటమిపై రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుంది. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు రేపు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి, పొత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు.
అయితే ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల పంపకాలు కూడా ఖరారైనట్టు సమాచారం. ఈ కూటమిలోకి రాష్ట్రీయ లోక్ దళ్, నిషద్ పార్టీలాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుని పోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమిలో చోటు దక్కే అవకాశాలు కన్పించడం లేదు. యూపీలో వొంటరిగానే పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సూచనప్రాయంగా తెలిపింది.