పాట్నా, జనవరి 11: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కులమేంటో తనకు తెలియదని... భారత దేశాన్ని పాలించిన మిగతా కాంగ్రెస్ ప్రధానులంతా అగ్ర కులాలకి చెందినవారేనని ఎల్జేపీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో పలు పార్టీలు అభ్యంతరాలను లేవనెత్తిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. బీహార్ లో ఆర్జేడీకి వొక్క సీటు కూడా రాదని అన్నారు. ఆర్జేడీకి చెందిన రఘువంశ్ ప్రసాద్ సింగ్, జగదానంద్ సింగ్ లాంటి ఎంతో మంది నేతలు అగ్రవర్ణాలకు చెందినప్పటికీ... వారి సామాజికవర్గం నుంచి ఓట్లను సాధించలేరని తెలిపారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల బిల్లు చారిత్రాత్మకమని చెప్పారు.