జగన్ పై మండిపడ్డ కేఏ పాల్

SMTV Desk 2019-01-10 20:35:03  KA Paul, YS Jagan mohan reddy, YSRCP, Praja shanthi party, TDP, Chandrababu

భీమవరం, జనవరి 10: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈ రోజు భీమవరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాల్ మాట్లాడుతూ వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి అంటూ పార్టీలోని తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడంటూ విరుచుకుపడ్డారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఎలాంటి స్పెషల్‌ ప్యాకేజీలు అవసరం లేకుండానే రాష్ట్రాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని పాల్ ధీమా వ్యక్తం చేశారు. తన పార్టీ గెలిచిన నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో కార్పొరేట్‌ వైద్యం, విద్యా, ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే తనకెంతో ఇష్టమన్నారు. రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నఆయన రాష్ట్రాని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు.

సింగపూర్‌ తరహా అభివృద్ధి చేస్తానని చెప్పి కనీసం రోడ్లు కూడా సరిగ్గా వెయ్యలేకపోయారని విమర్శించారు. ప్రజలను రక్షించడానికే ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దివంగత నేత, స్పీకర్‌ జీఎంసీ బాలయోగి రాష్ట్రపతి కావాలని కలలు కనేవారని అయితే అది నెరవేరక ముందే దురదృష్టవశాత్తు చనిపోయారన్నారు. తాను శ్రీకాకుళం జిల్లాకు చెందిన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని అయితే తాను వివాహమాడింది దళిత స్త్రీని అని చెప్పుకొచ్చారు. ఇప్పటి పాలకులకు నా సామర్థ్యం తెలియనిది కాదన్నారు. ఇప్పటీకే కోటి ఇరవై వేల మంది పాల్‌ అభిమానులు ప్రజల్లో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మార్చి నాటికి రాష్ట్రంలో విశేషమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయని ఎన్నో కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయని జోస్యం చెప్పారు. ఫ్రిబవరి 21 నుంచి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.