జన్మ భూమి-మా ఊరు కార్యక్రమంలో విషాదం

SMTV Desk 2019-01-10 19:58:16  Janma bhoomi maa ooru, Chittoor district, Police vehicle accident, Constable died,TDP

చిత్తూరు, జనవరి 10: చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన జన్మ భూమి-మా ఊరు కార్యక్రమానికి రక్షణ కల్పించడానికి వెళ్తున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురవడం వల్ల ఆ సభలో విషాద వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల ప్రకారం చిత్తూర్ జిల్లా పూతలపట్టు మండలంలోని కల్లూరు గ్రామంలో జన్మభూమి గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ భద్రత కోసం పూతల పట్టు పోలీస్ స్టేషన్ ఎస్సై మల్లేష్ యాదవ్ ఐదుగురు కానిస్టేబుళ్లను తీసుకుని పోలీస్ వాహనంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుతప్పింది. రోడ్డు పక్కన వున్న ఓ చింతచెట్టుకు ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ ప్రమాదంలో ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం గురించి తెలసుకున్న స్థానికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అధికారిక కార్యక్రమానికి బందోబస్తు కోసం వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి చనిపోవడం తీవ్రంగా బాధిస్తోందని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ తరపున మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు మృతుడి కుటుంబంలో వొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.