హైదరాబాద్, జనవరి 10: ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కథనాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయాలంటే నయనతార .. అనుష్క పేర్లు గుర్తొస్తాయి. వీరి తరువాత త్రిషను ఎంపిక చేసుకుంటారు. మిగతా సీనియర్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ కథ మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించడానికి వాళ్లు ధైర్యం చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కెరియర్ తొలినాళ్లలోనే మహానటి లాంటి సినిమా చేసి కీర్తి సురేశ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన మరో సినిమాను అంగీకరించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మించనున్న ఓ సినిమాలో కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారు. గురువారం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.