హైదరాబాద్, జనవరి 10: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈమధ్య కాకినాడలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత క్రాంతిమాధవ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు .. ఓనమాలు తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న క్రాంతిమాధవ్, తన తదుపరి సినిమాలో కథానాయకుడిగా విజయ్ దేవరకొండను ఎంపిక చేసుకున్నాడు.
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారు కానీ చివరికి కేథరిన్ ను ఎంచుకున్నారు. అందం పరంగా తెలుగులో మంచి మార్కులు కొట్టేసిన కేథరిన్, రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రాంతిమాధవ్ మూవీలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.