అస్సాం, జూలై 28 : గుడ్లు పెట్టే బాతును చంపినందుకు ఉరిశిక్ష విధించాలని పోలీసులను కోరింది ఓ మహిళ. వివరాలలోకి వెళితే.. అస్సాంలోని గువహతి ప్రాంతంలో గుడ్లు పెట్టే బాతును తన ఇంటి పక్కనే నివాసం ఉంటున్న కుసుంబార్ అనే వ్యక్తి చంపేశాడంటూ రేణు అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఆ బాతు ఇంట్లోకి వచ్చినప్పుడు కర్రతో కొట్టాను కాని దాన్ని చంపలేదంటూ కుసుంబార్ చెబుతున్నాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం కుసుంబార్పై కేసు నమోదు చేసి ఆ బాతు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి, బాతు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ పశు వైద్యశాలకు పంపించినట్లు నూన్మతి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీ రాజిబ్ తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం జంతువును చంపినందుకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు, అంతేగానీ ఉరిశిక్ష విధించడం కుదరదని రాజిబ్ పేర్కొన్నారు.