నేడు భారత్ కు అసలు పరీక్ష

SMTV Desk 2019-01-10 13:10:19  Asia Football Cup, India, UAE, Thailand

అబుదాబి, జనవరి 10: భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రారంభ మ్యాచ్ లో 4–1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్‌ ‘ఎ లో భాగంగా ఈరోజు ఆతిథ్య యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో భారత్‌ ఆడనుంది. యూఏఈ ర్యాంకింగ్స్‌లో కానీ, ఆటతీరులోగానీ భారత్‌ కంటే మెరుగ్గా ఉంది. అయితే బోణీ కొట్టిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ కనీసం ఈ మ్యాచ్‌ను ‘డ్రా చేసుకున్నా గ్రూప్‌ ‘ఎ నుంచి నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రపంచ 79వ ర్యాంకర్‌ యూఏఈ తొలి మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో ‘డ్రా చేసుకుంది. దీంతో హోస్ట్ జట్టు ఈ మ్యాచ్‌ విజయంపై కన్నేసింది. యూఏఈలో మిడ్‌ఫీల్డర్‌ ఇస్మాయిల్‌ హమది, అహ్మద్‌ ఖలీల్‌ కీలక ప్లేయర్లు. ఖలీల్‌ తొలి మ్యాచ్‌లో జట్టుకు కీలక గోల్‌ తెచ్చిపెట్టాడు. వీళ్లిద్దరిపై భారత డిఫెండర్లు దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు భారత్, యూఏఈ 13 సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందగా, ఎనిమిదింటిలో యూఏఈ విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా అయ్యాయి. ఈరోజు రాత్రి 9:30కు స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం అవుతుంది.