హైదరాబాద్, జనవరి 10: నగరంలో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్ట్ చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. గతేడాది జనవరిలో ఈ మెట్రో ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించుకొని ఈ ఏడాది పనులు ప్రారంభించనున్నారు. ఈ రెండో దశ నిర్మాణం సందర్భంగా నగరం నలుమూలల నుండి ఎయిర్ పోర్టుకి కనెక్టివిటీ పెంచడంతో పాటు వొక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రాయదుర్గం అరకు 31 కిలోమీటర్ల మేర రెండో దశ నిర్మాణం చేయాలనీ నిర్ణయించారు.
అంతేకాకుండా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26.2 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కిలోమీటర్లు కూడా చేపట్టనున్నారు. కొత్తగా ఉప్పల్ నుంచి మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ మార్గాన్ని చేపట్టే ప్రతిపాదన కూడా ఉన్నది. రాయదుర్గం , గచ్చిబౌలి, టీఎస్ పోలీస్ అకాడమీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, అదేవిధంగా మియాపూర్ బీహెచ్ఈఎల్, మదీనగూడ, హఫీజ్పేట్, కొండాపూర్, ఖాజాగూడ జంక్షన్, షేక్పేట్, రేతీబౌలీ, మెహిదీపట్నం మీదుగా లక్డీకపూల్కు కలుపనున్నారు.