న్యూఢిల్లీ, జనవరి 8: నిన్న రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకువచ్చింది. ఈ బిల్లుపై చర్చించిన అనంతరం ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోక్సభలో భాజపాకు స్పష్టమైన మెనార్టీ ఉన్నందున బిల్లు సునాయాసంగా ఆమోదం పొందవచ్చు. అసలు పరీక్ష రాజ్యసభలో ఎదురుకానుంది. రాజ్య సభలో అధికార పక్షానికి సరిపడ బలం లేనందున విపక్షాల నుంచి పలు సవరణలకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.