లక్నో, జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. వెనుకబడిన అగ్ర కులాల వారికి రిజర్వేషన్లు కల్పించడం మంచిదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ జిమ్మిక్కుగా ఆమె వర్ణించారు.
కాగా, గతంలో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీను గుర్తుచేశారు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రవర్ణ కులాల ఓట్లకు గాలం వేసేందుకే రిజర్వేషన్ల అంశాన్ని మోదీ తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా సంబంధిత బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.