కోల్కత్తా, జనవరి 8: జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 62 ఏళ్లుగా ఉన్న అధ్యాపక ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారు. అలాగే యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ (వీ.సీ) విరమణ వయస్సును కూడా 70 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం కోల్కత్తా వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో మమత ప్రకటించారు.
ఈ సందర్బంగా మమతా మాట్లాడుతూ... ‘‘ 60 ఏళ్లు దాటిన తరువాత ఓ ఉద్యోగి పనిచేయలేడని నేను అనుకోను. వారి అనుభవాలు, సేవలు మన విద్యార్థులకు చాలా అవసరం. అందుకే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్య కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం రూ. 28,000 కోట్లను ఈ ఏడాదికి ఖర్చు చేస్తున్నాం. కాగా ఉన్నత విద్యపై మమతా బెనర్జీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే నదియా జిల్లాలో కన్యశ్రీ విశ్వవిద్యాలయంకు జనవరి 10న శంకస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.