అమరావతి, జనవరి 7: వైసీపీ లోకి ప్రముఖ సినీ నటుడు అలీ రంగ ప్రవేశం చేస్తున్నాడని అనేక వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం పై అలీ నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా కలిసిన విషయం తెలిసిందే. కాగా అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను, ఏపీ సీఎం చంద్రబాబు ను కూడా కలిసారు. అయితే వారం వ్యవధిలో ఇలా ముగ్గురు కీలక నేతలను కలవడం ప్రధాన్యం సంతరించుకుంది. చాలా మంది గందరగోళానికి కూడా గురయ్యారు. కాగా.. దీనిపై అలీ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
తాను వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆలీ స్పష్టం చేశారు. తాను ఫ్యామిలీతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో జగన్ కనిపించారని.. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఎవరో ఫోటో తీస్తే అది కాస్తా వైరల్ అయి వార్తగా మారిందని తెలిపారు. వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తాను ఖండించనని.. అలా చేస్తే ఆ పార్టీని అవమానించినట్లు అవుతుందన్నారు. అయితే ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబుని కలవడంలో కూడా ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే కలిసినట్లు స్పష్టం చేశారు.