హైదరాబాద్, జనవరి 7: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘హార్వర్డ్ ఇండియా వార్షిక సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 16,17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్లో జరగనున్న ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపైన రెండు రోజుల పాటు ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
ప్రపంచ నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది విద్యావేత్తలు, ప్రతిభావంతులైన విద్యార్థులు, యువ వృత్తినిపుణులు హాజరు కానున్న ఈ సమావేశానికి కెటిఆర్ను ఆహ్వానిస్తూ యూనివర్సిటీ లేఖ పంపించడం విశేషం. ‘ఇండియా ఎట్ ఇన్ప్లేక్షన్ పాయింట్ థీమ్ అధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కెటిఆర్ను యూనివర్సిటీ వార్షిక సదస్సు నిర్వహక కమిటీ కోరింది.