బీహార్ హోమ్ లో అమ్మాయిలపై, దారుణంగా అత్యాచారాలు: సీబీఐ

SMTV Desk 2019-01-07 13:30:04  CBI, Bihar, shelter homes, Sex scandel

పాట్నా, జనవరి 7: బీహార్ లోని షెల్టర్ హోమ్ లో ఆడపిల్లలపై జరిగిన అకృత్యాలు, సెక్స్ స్కాండల్ పై విచారణ జరిపిన సీబీఐ, సంచలన నివేదికను పాట్నా కోర్టుకు అందించింది. ఈ కేసులో బ్రజేష్ ఠాకూర్, షెల్టర్ హోమ్ నిర్వాహకులు సహా 20 మంది నిందితులు ఉండగా, వారందరిపై 73 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అందులో విస్తుపోయే నిజాలను తెలియజేసింది. షెల్టర్ హోమ్ లోని అమ్మాయిలకు మత్తుమందులు ఇచ్చి, వారితో అసభ్య గీతాలకు డాన్స్ లు చేయించారని, బయటి నుంచి అతిథులను తీసుకు వచ్చి, వారితో రేప్ లు చేయించారని పేర్కొంది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు షెల్టర్ హోమ్ కు వచ్చి వెళుతుండేవారని పేర్కొంది. వారంతా అమ్మాయిలపై తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని చెబుతూ, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేసి విచారించామని పేర్కొంది.

మధ్య వయసు అమ్మాయిలతో బలవంతంగా దుస్తులు విప్పించి పలు చిత్రాల్లోని అసభ్య పాటలకు డ్యాన్సులు వేయించారని ఆరోపించింది. వారిని వ్యతిరేకించినా, ప్రశ్నించినా, చిత్ర హింసలకు గురిచేసేవారని పేర్కొంది. దాదాపు పది సంవత్సరాల పాటు వీరి దందా సాగిందని, ఎంతో మంది అమ్మాయిలు వీరి అఘాయిత్యాలకు బలయ్యారని పేర్కొంది. షెల్టర్ హోమ్ లోని 42 మంది అమ్మాయిల్లో 34 మందిపై లైంగిక దాడి జరిగిందని వైద్య పరీక్షలు నిరూపించాయని తెలిపింది. అధికార జనతాదళ్ ప్రభుత్వంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న బ్రజేష్ ఠాకూర్ ప్రధాన నిందితుడని వెల్లడించింది.