కర్నూల్, జనవరి 7: ఆళ్లగడ్డ నియోజక వర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి భూమ అఖిల ప్రియ రెడ్డి అనుచరుల ఇళ్ళల్లో పోలీసులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఓవైపు పోలీసుల తీరుపై సీరియస్ అవతూనే మరోవైపు నిరసన తెలిపారు. అనంతరం తన రక్షణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గన్ మెన్ల వెనక్కి పంపిచడంతో పాటు ఇకనుంచి తనకు పోలీస్ రక్షణ అవసరం లేదంటూ అఖిల ప్రియ నిరసనకు దిగారు. కాగా ఈ విషయంపై తాజాగా అఖిల ప్రియ వివరణ ఇచ్చారు.
ఎలాంటి కేసులు లేని వారి ఇళ్లపైనే పోలీసులు దాడులు చేశారని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాలేదని, షెడ్యూల్ విడుదలయ్యాక తన ఇంట్లో కూడా సోదాలు చేసుకోవచ్చని అన్నారు. తనను, తన కార్యకర్తలపై టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలే తన కు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. పోలీసులంటే మాకెంతో గౌరవమని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సర్డ్ చేశారని తెలిపారు. తప్పుడు సమాచారం తీసుకొని ఇలా చేయడం తగదని అన్నారు. ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని మరోసారి తేల్చి చెప్పారు.