హైదరాబాద్, జనవరి 6: సంక్రాంతి పండగ సందర్భంగా టిఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కల్పించి 50% మేర అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. పండగ సందర్భంగా అదనంగా 5252 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సులకు 50% మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రా ప్రాంతం వైపు వెళ్లేందుకు ఆన్లైన్లో ఎక్కువ బస్సులు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈనెల 10 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
కాగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు జేబిఎస్ నుంచి బస్సులు నడుపుతున్నారు. నల్గొండ, కోదాడ, యాదగిరిగుట్ట, వరంగల్ జిల్లాలకు ఉప్పల్ నుంచి బస్సులు వెళ్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కడప, నంద్యాల వైపు కాచిగూడ నుంచి..కర్నూలు, అనంతపురం వైపువెళ్లే బస్సులు పాత సిబిఎస్ నుంచి వెళ్తాయని చెప్పారు. ఖమ్మం జిల్లాకు మాత్రం ఎంజీబిఎస్ నుంచే వెళ్తాయన్నారు. విజయవాడ వైపు నగర శివారులో నుంచి బస్సులు నడుపుతామని టిఎస్ ఆర్టీసీ అధికారులు వివరించారు.