అమరావతి, జూలై 28: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సిద్ధం అయ్యింది. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే వైసీపీ, తెదేపాలు తమ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపబోతున్నది వెల్లడించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏవరా అన్న సందిగ్దతకు తెరపడనుంది. వివరాలలోకి వెళ్తే కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసి రెడ్డితోపాటు కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, అలీఖాన్లు కలిసి పార్టీ అభ్యర్థి కోసం అభిప్రాయసేకరణ జరిపారు. అధిష్టాన నిర్ణయానంతరం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.