కాంగ్రెస్ నేతలకు ఇంటెలిజెన్స్ నోటీసులు

SMTV Desk 2019-01-06 14:35:15  Congress party, Janareddy, Shabbir ali, Telangana Intelligence security wing notices

హైదరాబాద్, జనవరి 6: కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలకు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నోటీసులు పంపింది. వీరిద్దరూ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయపాలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగించిన వీరిద్దరూ రోజువారీ అద్దెతో పాటు డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం 2007లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు జీతభత్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

దీనిని అనుసరించి జానా, షబ్బీర్ అలీలకు నోటీసులు పంపినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించారు. జానారెడ్డి 11,152 కిలోమీటర్లు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని, అలాగే షబ్బీర్ అలీ 12,728 కిలోమీటర్లు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,79,936 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఇతర ప్రముఖులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడినందున వారికి కూడా ఇంటెలిజెన్స్ విభాగం నోటీసులు పంపినట్లు తెలిసింది.