చరిత్ర సృష్టించిన భారత్

SMTV Desk 2019-01-06 14:00:51  Team india, Australia, Test match,Sydney, Follow on

సిడ్నీ, జనవరి 6: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్...20 ఓవర్లు ఆడి కేవలం 64 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ని ముగించింది. వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. కాగా మ్యాచ్ ప్రారంభమైన ఆరు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టారు మన భారత బౌలర్లు. దీనితో ఆసీస్ బ్యాట్ మెన్స్‌పై తీవ్ర వొత్తిడి పెరిగింది. పైన్ (5), కుమిన్స్ (25), స్టార్క్ (29) పరుగులు చేశారు. చివరిలో క్రీజులో పాతుకపోయేందుకు హాజిల్ వుడ్ ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాన్ని యాదవ్ నిలువరించాడు. 300 స్కోరు వద్ద వుడ్‌ (21)ని అవుట్ చేశాడు. మొత్తంగా ఆసీస్ 104.5 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ని భారత్ ప్రారంభించకుండా ఫాలో ఆన్ ఆడించాలని నిర్ణయం తీసుకుంది. ఆటను ఓపెనర్లు ప్రారంభించారు. కొద్దిసేపటికే వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వికెట్ నష్టపోకుండా ఆసీస్ 6 పరుగులు చేసింది. ఇలా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం 30 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారంటే ఆ జట్టు ఎలాంటి పరిస్ధితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 1988లో సిడ్నీ గ్రౌండ్‌లోనే ఇంగ్లాండ్‌తో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.. దేశానికి అవతల కూడా చివరగా 2005లో ట్రెండ్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌పైనే ఫాలో ఆన్ ఆడగా ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలైంది. ఇక ఈ సిరిస్‌లో భారత్ ఓడిపోదని...విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంగారులు మాత్రం అవుట్ కాకుండా క్రీజులో ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. అయినా కూడా...ఇండియా 2-1 తేడాతో సిరిస్‌ని గెలుస్తుందని పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిపించిన తొలి భారత కెప్టెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 5 వికెట్లు, షమీ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, బుమ్రా 1 వికెట్ తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 622/7 డిక్లేర్డ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ : 300 రన్లు ఆలౌట్