హైదరాబాద్, జనవరి 6: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ మరో కొత్త ప్రయత్నాన్ని చేస్తుంది. అదే ఏకరూప పోలీస్. ఇందులో భాగంగా పోలీసులు 15 రోజుల పాటు అన్ని గ్రామాలు, పల్లెలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాలు, ఇలా అన్ని ప్రాంతాల్లో సంబంధిత శాంతి భద్రతల విభాగం పోలీసులు పర్యటించనున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది చేపట్టబోతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఏకరూప పోలీసింగ్ విధానం అమలు కోసం ప్రతీ వొక్కరు అంకితభావంతో పనిచేయాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే అందజేస్తామని డీజీపీ పేర్కొన్నారు. ఏకరూప పోలీసింగ్, ఏకరూప సర్వీస్ డెలివరీ విధానంపై డీజీపీ మహేందర్రెడ్డి జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో శనివారం ఆయన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇంకా పోలీసుల నుంచి ఎలాంటి సేవలు కావాలో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశాలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు. ప్రజల దగ్గర వున్న సమస్యలపై ఆయా జిల్లాల ఎస్సీలు, కమిషనర్లు, డీసీపీలతో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్ల నుంచి వచ్చిన అంశాలపై డీజీపీ మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. టీఎస్ కాప్ యాప్ ద్వారా సంఘటనా స్థలంలోనే కేసులు నమోదు చేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. బాధితుల ఇంటి నుంచే ఫిర్యాదులు, అక్కడి నుంచే టెక్నాలజీ సహాయంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మహిళా సంబంధిత నేరాల్లో బాధితుల ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.