ప్రకాశం, జనవరి 5: శుక్రవారం మాజీ ఎంపీ చిమటా సాంబు తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత అనుమతి ఇస్తే చీరాల నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో అత్యధికులు బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారని స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గ సీటుని యాదవ సామాజికవర్గానికి ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నారని.. కాబట్టి.. తనకు ఆ టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్, పవన్ లు మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారన్నారు.
చంద్రబాబు మొదట ప్రత్యేక ప్యాకేజీకి కావాలని చెప్పి ఇప్పుడు మళ్లీ హోదా కావాలని అంటున్నారని మండపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పక్షాలను కూడగట్టారన్నారు. 1989లో బోఫోర్స్ కుంభకోణం నేపథ్యంలో 105మంది ఎంపీలను రాజీనామా చేయించి కాంగ్రెస్ కి వణుకు పుట్టించారన్నారు. ఆ 105మంది ఎంపీలలో తాను వొకడినని గుర్తు చేశారు. అలాంటి నేపథ్యం ఉన్న టీడీపీని వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లీ కాంగ్రెస్ తో జతకట్టడం దారుణమన్నారు.