హైదరాబాద్, జనవరి 5: శుక్రవారం తెలంగాణ భవన్లో హుజూర్నగర్, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, భాజపా, తెదేపాకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తెరాస నేతలకు పలు సూచనలు చేశారు. టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్.‘ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఇచ్చిన రూ. 500 కోట్లకు ఆశపడి కాంగ్రెస్ తెదేపాకి దాసోహమైంది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ప్రచారం చేసినప్పటికీ కేసీఆర్ పై విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేసి మరో సారి తెలంగాణను తెరాసను ఆశీర్వదించారు.
అంతేకాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ ఖచ్చితంగా ఓడిపోయేవారని కారు, ట్రక్కు గుర్తులు రెండు వొకే విధంగా ఉండటం వల్ల ఓట్లు చీలిపోయాయన్నారు. తెరాస పార్టీ నేతలు విజయ గర్వంతో కాకుండా ప్రజా సేవతో ముందుకెళ్లాలన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో ఆరుస్థానాలు గెలిచిన తెరాస మొన్నటి ఎన్నికల్లో కార్యకర్తలు, నేతల కృషితో బలాన్ని 9 స్థానాలకు పెంచుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అసలు తెరాసకు పోటీ లేదన్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మరో సారి ఘన విజయాన్ని సాధించి తెలంగాణ సత్తాను జాతీకి చాటాలన్నారు.