న్యూఢిల్లీ, జనవరి 5: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో కన్నుకొట్టిన ఘటన గుర్తుండే ఉంటుంది. దీనిపై అధికారపక్షం సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా, లోక్ సభలో మరోమారు ఇదే సీన్ రిపీట్ అయింది.
రఫెల్ డీల్ పై లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చ ఘాటుగా సాగుతున్న సమయంలో రాహుల్ కన్నుకొట్టారు. ఈ చర్చ సందర్భంగా అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై ప్రసంగిస్తున్న సమయంలో తన మద్దతు తెలుపుతూ బల్లపై చరిచిన రాహుల్, ఆ తర్వాత తన వెనుక ఉన్న నేతతో ఏదో మాట్లాడుతూ కన్నుకొట్టారు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో మళ్లీ ఇది వైరల్ అవుతోంది.