వైసీపీతో ఏ పార్టీ పొత్తు లేదు..!!!

SMTV Desk 2019-01-04 17:35:21  YSRCP, YS Jagan mohan reddy, YV Subbareddy, TDP, Chandrababu

కాకినాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎవ్వరితో పొత్తు పెట్టుకోదని వొంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జగన్ దమ్ము ధైర్యం ఉన్న నాయుకుడు అంటూ కొనియాడారు. శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్.ఐ.ఎకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. న్యాయస్థానంపై తమకు అపార నమ్మకం ఉందన్నారు. ఖచ్చితంగా ఎన్.ఐ.ఎ విచారణలో దోషులంతా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. హత్యాయత్నం కుట్ర వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలు సీఎం స్ధాయి వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు.

కత్తితో దాడిఘటనలో భగవంతుడు దయ, ప్రజల ఆశీస్సులతో జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను విన్నారని చెప్పారు. ఆ సమస్యలు రాబోయే రోజుల్లో ఏలా పరిష్కరించాలో చెప్తూ వారిలో భరోసా నింపుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మనో ధైర్యం ఇస్తూ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించిందని మండిపడ్డారు. తమ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేసే పరిస్ధితి వైసీపీకి లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.