ఢిల్లీ, జూలై 28: మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను కేటాయించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విభజన జరిగినప్పడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇప్పడి వరకు ఒకే గవర్నర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల పాలన హైదరాబాద్, అమరావతిల నుంచి జరుగుతున్నందున వేర్వేరు గవర్నర్లు ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ను ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తెలంగాణకు నియమించే అవకాశాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండాలని లేదని, గరిష్ఠంగా పదేళ్లని మాత్రమే ఉంది కనుక కేంద్రానికి గవర్నర్లను నిమించే అధికారం ఉన్నట్లు వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశాలనంతరం నియామకాలు ఉండవచ్చు అని ఒక అధికారి తెలిపారు.