రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే మోదీ లక్ష్యం : యనమల

SMTV Desk 2019-01-03 19:56:33  Yanamala ramakrishnudu, TDP, BJP, Narendramodi

తుని, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇవ్వాళ తూర్పుగోదావరి జిల్లా ఎండపల్లిలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న యనమల కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ రాజకీయాలు కేసీఆర్ కు అవసరమా అంటూ నిలదీశారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ప్రధాని నరేంద్రమోదీ కలిసి చంద్రబాబును అణిచివెయ్యాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదలలో కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తాము నెరవేర్చామని, మేనిఫెస్టోలో పెట్టని పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్ని సైతం పూర్తి చేసినట్టు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.