చరిత్రలో నాడు తండ్రి యాత్ర...!!!నేడు తనయుడి యాత్ర...???

SMTV Desk 2019-01-03 19:35:43  YSR, YS Jagan mohan reddy, YSRCP, Dharmana prasdarao

శ్రీకాకుళం, జనవరి 3: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రజాసంకల్పయాత్ర రాష్ట్రంలో పెనుమార్పులకు కారణం కాబోతుందని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాయలంలో మాట్లాడిన ధర్మాన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈనెల 9న ఇచ్చాపురంలో జరగనుందని పేర్కొన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎటువంటి మార్పు రాష్ట్రంలో వచ్చిందో మళ్లీ వైఎస్‌ జగన్‌ పాద యాత్రతో అది రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. తనకుతానుగా గొప్పవాడు అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో పెట్టుకున్న అగ్రిమెంట్ లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టగలరా అని నిలదీశారు. ధర్మపోరాట దీక్షను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నారని ఆరోపించారు.

అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తయారు చేశారన్నారు. సమర్ధవంతమైన పాలన అంటే చంద్రబాబుకు తెలియదన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపేందుకే నీరు చెట్టు కార్యక్రమం అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని ఆ ప్రభుత్వంలో పని చేసిన ప్రధాన కార్యదర్శిలే బయటకు వచ్చి చెప్తున్నారని గుర్తు చేశారు. మొదటి విడత ఇల్లులకు బిల్లులు చేయకుండా ఇప్పుడు జన్మభూమిలో ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించడం ప్రజలను మోసం చేయడం కాదా? అని నిలదీశారు. ఆరోగ్యశ్రీ కి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేని సీఎంది సమర్థవంతమైన పాలనా అని ప్రశ్నించారు? నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు కేబినేట్ ఎన్నో నిర్ణయాలు తీసుకుందని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. వొక రాష్ట్రప్రతిపక్ష నేత సుదీర్ఘకాలం పాదయాత్ర చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమన్నారు ధర్మాన ప్రసాదరావు.