అమరావతి, జనవరి 3: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబు పై విమర్శలు కురిపించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారని ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటారని తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ తో జతకట్టారని ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో జోడి కుదుర్చుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం జతకట్టడం ఆ తర్వాత వారిపైనే బురద జల్లడం చంద్రబాబు నైజమని ఆమె ఆరోపించారు. అబద్ధపు హామీలు, ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబుని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అభిప్రాయపడ్డారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పవన్ తో పొత్తు పెట్టుకుంటే తమ వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ముందు పవన్, చంద్రబాబులు విడిపోతే అప్పుడు జనసేనతో పొత్తు గురించి తాము ఆలోచిస్తామని ఆమె వివరించారు. ఇప్పటికీ పవన్ టీడీపీతో రహస్య పొత్తు కొనసాగిస్తున్నారన్నారు.