న్యూఢిల్లీ, జనవరి 3: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన బీజేపీ పార్టీ రైతులకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఖరీఫ్, రబీ వొక్కో పంటకాలానికి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకే నగదును బదిలీచేసే కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, ఎకరానికి రూ.50 వేల వడ్డీ రహిత (రైతుకు గరిష్టంగా రూ.లక్ష) రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ఈ రెండు పథకాల వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.2.3 లక్షల కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీ పథకాన్ని కూడా వీటిలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడుతుందని భావిస్తున్నారు.