అయేషా మీరా హత్య కేసులో కొత్త మలుపు

SMTV Desk 2019-01-02 17:33:32  High court, Vijayawada, Ayesh meera, Death mystery, CBI

విజయవాడ, జనవరి 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007 డిసెంబర్‌ 26న సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసుకు సంబంధించి దర్యాప్తులో వేగం పెంచింది సీబీఐ. కేసు నమోదు చేసిన మురుసటి రోజే ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అయేషా మీరా హత్య కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై సీబీఐ కొన్ని కుట్రకోణాలను బట్టబయలు చేసింది. కుట్రపూరితంగానే అయేషా మీరా హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలను నాశనం చేసినట్లు గుర్తించింది. విచారణలో సేకరించిన వివరాలతో సీబీఐ అధికారలు నివ్వెరపోయారు. హైకోర్టులో అయేషా మీరా కేసు పెండింగ్ లో ఉందన్న విషయాన్ని దాచి ఉంచిన ఉద్యోగులు జడ్జి ముందు ఆ ప్రస్థావన తీసుకు రానట్లు గ్రహించింది. ఏదైనా కేసుకు సంబంధించి సాక్ష్యాలు ధ్వంసం చేసేముందు కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. నాన్ వాల్యూబుల్స్ ధ్వంసం చేసే ముందు అప్పీలు సంగతి జడ్జికి వివరించాల్సిన అవసరం కోర్టు సిబ్బందికి ఉంటుంది. ఈ వ్యవహారాలన్నింటిని చక్కదిద్దాల్సిందే కోర్ట్ క్లర్క్.

ఈ నేపథ్యంలో కోర్టు క్లర్క్ టి.కుమారిని ప్రధాన నిందితురాలిగా చేరుస్తున్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపారు సీబీఐ అధికారులు. 2014లో ఈ కేసులో సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు మెజిస్ట్రేట్ ముందుకు అప్పటి క్లర్క్ పి. వెంకట కుమార్ ఫైల్ పెట్టారు. కోర్టులో తనిఖీలు ఉన్న నేపథ్యంలో అనుమతి కోరితే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అయేషా మీరా హత్య కేసు పెండింగ్ లో ఉందన్న విషయం ప్రాపర్టీ క్లర్క్ ఎక్కడా ప్రస్తావించలేదని సీబీఐ విచారణలో తేలింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది సీబీఐ. అయేషా మీరా హత్య కేసులో సిట్ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ్మడి హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కేసుకు సంబంధించి రికార్డులు ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది.