న్యూ ఢిల్లీ, జనవరి 1: తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి కొత్త సంవత్సరం రోజున కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకూ సంవత్సర ఆదాయం ఉన్నవారికి గృహరుణంపై రూ. 2.5 లక్షల సబ్సిడీని అందిస్తున్న పథకాన్ని మార్చి 2020 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్, ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ 93 వేల మంది లబ్దిని పొందారని అన్నారు. ఇప్పటివరకు కేంద్రం సబ్సిడీ కింద రూ. 1,960 కోట్లను అందించిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి వొక్కరికీ సొంత ఇల్లును అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.