హైదరాబాద్, డిసెంబర్ 31: చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రా ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ బీజేపీ విషయంలో వొకటే విధంగా వ్యవహరిస్తున్నామని, బీజేపీతో టీఆర్ఎస్ కు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. బాబు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబులా పూటకోమాట మాట్లాడే అలవాటు సీఎం కేసీఆర్ కు లేదని అన్నారు. అడ్డదారుల్లో పోవడం చంద్రబాబుకు అలవాటేనని, ఆయన మాటలకు మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారని విమర్శించారు. పరిపాలన అంటే ఎలా ఉండాలో నాలుగున్నరేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. దేశంలోని 36 పార్టీలను వొప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ ది అని చంద్రబాబుకు అణువణువునా తెలంగాణపై వ్యతిరేకత ఉందని, అటువంటి బాబుతో కూడా ‘జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్ ది అని వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన తప్పదని తెలిసినా చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారని, ఈ విషయమై ప్రజలను మోసగించేలా ఆయన మాట్లాడారని దుమ్మెత్తిపోశారు