బాలికపై అత్యాచారం కేసు : మాజీ ఎమ్మెల్యే కి పదేళ్ళు జైలు

SMTV Desk 2018-12-29 20:59:05  DMK, MLA, Rajkumar, Court, Jail, Minor child, Rape case

కేరళ, డిసెంబర్ 29: డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌కు బాలికలపై అత్యాచారం కేసులో కోర్టు పదేళ్ళు జైలు శిక్ష విదించింది. 2006లో రాజ్‌కుమార్ పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఆయన ఇంట్లో పనికి చేరింది. ఆమెపై రాజ్‌కుమార్ ప్రతిరోజు లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దీంతో బాలిక తన తల్లికి ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. కుమార్తె పరిస్థితి అర్థం చేసుకున్న వారు ఆమెను తీసుకెళ్లడానికి అక్కడికి బయలుదేరారు.

ఇంతలో రాజ్‌కుమార్ స్నేహితుడు జయశంకర్ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. కంగారుగా హస్పిటల్‌కు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే సరికిగా ఆమె మరణించింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. ఈ కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, సన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై సీబీ-సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అనంతరం కేసు విచారణను పెరంబలూరు కోర్టు నుంచి కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీల నేరాలను విచారించే ట్రయల్ కోర్టుకు బదిలీ చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం రాజ్‌కుమార్, ఆయనకు సహకరించిన స్నేహితుడు జయశంకర్‌ను దోషులుగా నిర్థారించిన కోర్టు వారిద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.42 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.