అయేషా మీరా హత్య కేసు : హై కోర్టు కీలక నిర్ణయం

SMTV Desk 2018-12-29 19:25:35  High court, Vijayawada, Ayesh meera, Death mystery, CBI

విజయవాడ, డిసెంబర్ 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007 డిసెంబర్‌ 26న సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసుకు సంబంధించి దర్యాప్తులో వేగం పెంచింది సీబీఐ. కేసు నమోదు చేసిన మురుసటి రోజే ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అయేషా మీరా హత్య కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. అంతేకాదు కేసుకు సంబంధించి రికార్డులు ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం కేసు నమోదు చేసిన సీబీఐ మరుసటి రోజే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసింది. సాక్ష్యాలు, పత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది.

2007 డిసెంబర్‌ 26న విజయవాడలోని ఓ హాస్టల్‌లో అయేషా మీరాపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అయేషా మీరా తల్లితో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈకేసులో సత్యంబాబు నిందితుడు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే సత్యంబాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అతడు ఇటీవలే విడుదలయ్యాడు. సత్యంబాబు విడుదల అనంతరం విచారణకు సిట్‌ ను నియమించింది ఏపీ సర్కార్. అయితే సిట్ ఇన్వెస్టిగేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు సైతం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ స్వేచ్ఛతో వ్యవహరించొచ్చని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు, సాక్ష్యాధారాలు, ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన దర్యాప్తు వివరాలను కూడా సీబీఐ వినియోగించుకోవచ్చని సూచించింది.