హైదరాబాద్, డిసెంబర్ 29: ఇవాళ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని అఖిలపక్ష పార్టీలు, బీసీ, సామాజిక సంఘాల నేతలు ముట్టడించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34శాతం వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ వారికే వెన్నుపోటు పొడిచారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణలో 88 శాతం ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగుతోందని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్ను తొలగించాలని పొన్నాల డిమాండ్ చేశారు. తెలంగాణలో దొరల రాజ్యం తీసుకురావడానికే కేసీఆర్ బీసీ రిజర్వేషన్లను తగ్గించి అన్యాయం చేశారని, బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.