హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సమితి తాజా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉత్తరప్రదేశ్ మౌలికవసతుల, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్ మహానా కలిశారు. 2019లో జరగబోయే కుంభమేళాకు రావాలని కేటీఆర్ ను సతీశ్ మహానా ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు యూపీలోని అలహాబాద్(ప్రయాగరాజ్)లో జరగనున్న కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర గంగా స్నానాల కోసం తరలిరానున్నారు. మహా కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే భక్తుల బసకు ఫంక్షన్హాళ్లును వాడుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం జనవరి నుంచి మార్చి వరకు మూడునెలలపాటు పెండ్లిళ్లు తదితర సామూహిక కార్యక్రమాలను జరుపుకోరాదని స్థానిక ప్రజలకు సూచించింది.