హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ సర్కార్ విద్యార్దుల బీటెక్ పట్టాలపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐసీటీఈ అనుమతి లేకుండా ఈ వర్సిటీలు ఇచ్చే ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లుబాటు కావని తెలంగాణ ఉన్నత విద్యామండలి తేల్చేసింది. ఇందులో భాగంగానే ఓ విద్యార్థిని ఇంజనీరింగ్ డిగ్రీని తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలివేటు గీతం యూనివర్సిటీ విద్యార్థినిపై పడింది. 2014లో ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థిని ఈ ఏడాదే కోర్సు పూర్తి చేసుకుంది. అనంతరం కరీంనగర్లోని ఓ ఎంబీఏ కాలేజీలో యాజమాన్య కోటాలో అడ్మిషన్ తీసుకుంది. నిబంధనల ప్రకారం యాజమాన్య కోటా అడ్మిషన్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ధ్రువీకరించాలి.
ఇందులో భాగంగానే కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థిని సమర్పించిన సర్టిఫికెట్లను మండలి అధికారులకు అందజేసింది. గీతం వర్సిటీ నుంచి అందిన బీటెక్ సర్టిఫికెట్ చెల్లదని అధికారులు తేల్చిచెప్పారు. ఆ సర్టిఫికెట్ను తిరస్కరించారు. రాష్ట్రాల్లో ఏఐసీటీఈ అనుమతి లేకుండా సాంకేతిక కోర్సులు అందిస్తున్న వర్సిటీలను, కాలేజీలను మూసివేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. ఈ యేడాది ఏఐసీటీఈ అనుమతి పొందిన డీమ్డ్ వర్సిటీల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం 3వర్సిటీలు మాత్రమే ఉన్నాయి. అవి ఐఐఐటీ-హైదరాబాద్, కేల్ యూనివర్సిటీ, ఇక్ఫాయ్ వర్సిటీ.ప్రముఖ వర్సిటీలుగా పేరొందిన గీతమ్, సింఘానియా, ఎమిటీ, సింబియాసిస్ వర్సిటీల పేర్లు జాబితాలో లేవు