హైదరాబాద్, డిసెంబర్ 29: యాంగ్ హీరో విజయ్ దేవరకొండ భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కొన్ని రోజులుగా కాకినాడలో షూటింగు జరుపుకుంటోంది. కాకినాడలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తాజాగా చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసింది. ఇటీవల షూటింగ్లో భాగంగా రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ... సినిమాల్లో కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదన్నారు.
ఈ సినిమాని పూర్తిగా కాకినాడ నేపథ్యంలోనే తెరకెక్కించామన్నారు. దర్శకుడు భరత్ వాస్తవికతకు అద్దం పట్టేలా కాకినాడ మార్కెట్, జగన్నాథపురం బ్రిడ్జ్, బీచ్ ప్రాంతాల్లో ఎక్కువగా సన్నివేశాలు చిత్రీకరించారన్నారు. గతంలో విజయ్ నటించిన నోటా సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగింది. ఈ సందర్బంగా రాజకీయ ప్రవేశం గురించి అడగగా రాజకీయాలపై దృష్టిసారించేంత సమయం తనకు లేదని.. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.