ఆసిస్ అభిమానులకి కోహ్లి దిమ్మతిరిగే రిప్లై

SMTV Desk 2018-12-28 20:23:32  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli, Australian audience

మెల్ బోర్న్, డిసెంబర్ 28: భారత్ - ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ వివాదాలకు కేంద్రంగా మారింది. ఎంసిజి స్టేడియంలో రెండో రోజు ఆటలో భాగంగా బౌండరీ వద్ద పీల్డింగ్ చేస్తున్న భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ కొందరు ఆసిస్ అభిమానులు అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భారతీయ అభిమానులను కూడా వారు దూషించారు. మీ వీసా చూపించండి అంటూ ఆసిస్ అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు మ్యాచ్ ను ప్రసారం చేస్తున్న మీడియా కెమెరాలకు చిక్కినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారాన్ని సదరు మీడియా సంస్థ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. తమ ఛానెల్ లో ప్రసారమైన వీడియో ఫుటేజిని సీఎ అధికారులకు అందించారు. దీంతో సీరియస్ అయిన సీఎ అధికారులు మెల్ బోర్న్ లోని విక్టోరియా పోలీస్ స్టేషన్ కు, స్టేడియం మేనేజ్ మెంట్ కు వీడియోను పంపించి వివరణ కోరింది. ఇలా అనుచితంగా వ్యవహరించిన ఆసిస్ అభిమానులకు సీఎ గట్టిగా హెచ్చరించింది. దేశంలో పర్యటిస్తున్న అతిథుల పట్ల సంయమనంతో, మర్యాదగా మెలగాలని సూచించింది. ఇకనుంచి విక్టోరియా పోలీసులు, స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షిస్తుంటారని సీఎ అధికారి ప్రతినిధి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూసుకుంటామని వెల్లడించారు.

మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని "పనికిరాని వ్యక్తి" అంటూ నినాదాలు చేశారు. దీనిపై కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. కోహ్లీ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోని టెలిగ్రాఫ్ స్పోర్ట్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అందులో అభిమానుల నినాదాలను కోహ్లీ వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తన క్యాప్‌ని తీసి మరీ ఫోజుఇచ్చాడు.