మహేశ్ ఆఫీసుపై జీఎస్టీ అధికారుల దాడులు..!

SMTV Desk 2018-12-28 18:05:45  Mahesh babu, GST Officers, IT Rides

హైదరాబాద్, డిసెంబర్ 28: టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. సేవా పన్ను చెల్లించని సందర్బంగా హైదరాబాద్ లోని మహేశ్ బాబు కార్యాలయంపై ఈరోజు దాడులు జరిపారు. 2007-08 సంవత్సరంలో మహేశ్ వివిధ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మొత్తం రూ.18.5 లక్షల సేవా పన్నును చెల్లించాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ పన్నులు, వడ్డీ, జరిమానా మొత్తం కలిపి రూ. 73.5 లక్షలు రికవరీ చేసేందుకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేశ్ బాబు ఖాతాలను అటాచ్ చేస్తూ జీఎస్టీ కమిషనర్ నిన్న ఉత్తర్వులు జారీచేశారు.

ఈ రోజు మధ్యాహ్నం మహేశ్ ఆఫీసుకు చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై జీఎస్టీ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఈ పన్ను వివాదంపై మహేశ్ బాబు గతంలో పన్ను వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను ఆశ్రయించారని తెలిపారు. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో మహేశ్ హైకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో తాజాగా జీఎస్టీ అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. యాక్సిస్ బ్యాంకులో మహేశ్ ఖాతాలో ఉన్న రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నామనీ, ఇంకో 30.5 లక్షలను వసూలు చేయాల్సి ఉందని అన్నారు.