హైదరాబాద్, డిసెంబర్ 28: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమాను కూడా పట్టాలెక్కించాడు. ఈ సినిమాల పూర్తయిన తరువాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ తో సినిమా చేస్తే ఆయనకి గల క్రేజ్ కారణంగా చాలా భాషల్లో విడుదల చేసుకోవచ్చు. అందువలన ఆయనతో వొక ప్రాజెక్టు చేయడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపుతున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడట. ఈయన దర్శకత్వంలో కన్నడలో రూపొందిన కేజీఎఫ్ ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, ఇతర భాషల్లోను రిలీజ్ అయింది. ఈ సినిమా రిజల్ట్ సంగతి అటుంచితే హీరోను దర్శకుడు చూపించిన తీరు .. కథను డీల్ చేసిన విధానం ప్రభాస్ కి బాగా నచ్చాయట. అందువలన తనకు మంచి కథను సిద్ధం చేయమనీ .. కథ నచ్చితే చేసేద్దామని ప్రశాంత్ నీల్ తో అన్నాడట. అప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.